బాబ్లీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరినదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై రెండు వారాల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాబ్లీ ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాదనలు ఏమిటి, ఈ సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలేమిటి తెలియజేస్తూ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బాబ్లీ ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇంతకు ముందు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు సెప్టెంబర్ 20వ తేదీన ఇరు రాష్ట్రాల మధ్య సమావేశం జరిగింది. ఈ స్థితిలో సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా తమ తమ వాదనలను లిఖితపూర్వకంగా తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వర్షాల కారణంగా బాబ్లీ పనులు ఆగిపోయాయి. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.