హామీలను నెరవేర్చి తీరుతాం: సోనియా
కర్నూలు: ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తాము కట్టుబడి ఉన్నామని, అందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. బుధవారంనాడు కడప బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆమె కర్నూలు పర్యటనకు వచ్చారు. కర్నూలులో ఆమె కిసాన్ ఘాట్ను ప్రారంభించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయనకు నివాళులు అర్పించారు. గాంధేయ విలువలకు కట్టుబడిన కోట్ల విజయ భాస్కర రెడ్డి ఆదర్శనీయుడని ఆమె అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చాయని, ఇంకా నెరవేర్చాల్సినవి ఎన్నో ఉన్నాయని, వాటిని నెరవేర్చి తీరుతామని ఆమె అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు వుంటుందని ఆమె హామీ ఇచ్చారు. పేదల జీవితాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రణాళికలను ఆమె వివరించారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో వ్యవసాయాన్ని విస్మరించారని, దీని వల్ల రైతులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని, రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు తాము పలు చర్యలు తీసుకున్నామని ఆమె చెప్పారు.