పత్రికలపై దాడి వైయస్కు తగదు: వెంకయ్య
హైదరాబాద్: పత్రికలపై విరుచుకు పడడం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి తగదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఏ పత్రిక ఏది అవసరమనుకుంటే అది రాస్తుందని, ప్రాధాన్యతలు కూడా పత్రికను బట్టి మారుతాయని, దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదని, అయితే కొన్ని విషయాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని తాము అడగవచ్చునని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు భూసేకరణ అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణపై బిజెపి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన విమర్శను ఆయన ఖండించారు. ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం కాంగ్రెస్కు అలవాటని ఆయన అన్నారు. దేశభద్రత వంటి పలు విషయాలతో పాటు ప్రత్యేక తెలంగాణ విషయంలో కూడా కాంగ్రెస్ మాట తప్పిందని ఆయన అన్నారు. వివిధ పార్టీలు చెబుతున్న విషయాలపై చర్చ జరగాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.