11లోపు సిబిఐ ప్రాథమిక నివేదిక: హైకోర్టు
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై సిబిఐ తన ప్రాథమిక నివేదికను అక్టోబర్ 11వ తేదీ లోపల తమకు సమర్పించాలని హైకోర్టు గురువారంనాడు ఆదేశించింది. అవుటర్ రింగ్ రోడ్డుపై వచ్చిన ఆరోపణల మీద సిబిఐ విచారణ ఉత్తర్వులను అడ్వొకేట్ జనరల్ మోహన్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. ఈ కేసు విచారణను హైకోర్టు అక్టోబర్ 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నవారందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారందరూ వచ్చే నెల 23వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అవుటర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కడియం శ్రీహరి, నాగం జనార్దన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, మంత్రి జె.సి. దివాకర్ రెడ్డిలతో సహా 75 మందిని వారు ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు.