బాబు భద్రత కుదింపు స్వల్పమే: జానారెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి భద్రతను కుదించాలనే నిర్ణయం తీసుకున్నది కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబి) అని రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. చంద్రబాబు భద్రతకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ను పంపించారని, అందుకే గ్రేహౌండ్స్ దళాలను తగ్గించారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు భద్రతకు ఇప్పటికీ 154 మంది సిబ్బంది ఉన్నారని ఆయన అన్నారు. తమ భద్రతను తగ్గించుకునైనా సరే చంద్రబాబుకు భద్రత కల్పిస్తామని ఆయన అన్నారు. తొలగించింది 29 మందిని మాత్రమేనని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా)ని వేరే చోటికి తరలించబోమని ఆయన స్పష్టం చేశారు. పోలీసు అకాడమీని అవుటర్ రింగ్ రోడ్డులో భాగంగా వేరే చోటికి తరలించాలని ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో దీని కన్నా మెరుగ్గా 300 ఎకరాల భవనంతో మూడు కోట్ల రూపాయలతో నిర్మించగల పరిస్థితి ఉంటే అప్పాను తరలిస్తామని జానారెడ్డి చెప్పారు. చంద్రబాబుకు ఎంత భద్రత ఉండాలని నిర్ణయించేది తాము కాదని, భద్రతా కమిటీ ఆ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కావాలంటే అదనపు భద్రత కల్పిస్తామని ఆయన చెప్పారు.