93 పేలుళ్లు: మరో ఐదుగురు దోషులు
ముంబాయి: 1993 ముంబాయి వరుస పేలుళ్ల కేసులో టాడా కోర్టు శుక్రవారంనాడు మరో ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. గుల్ మొహమ్మద్ నూర్ మొహమ్మద్ షేక్, షేక్ ఇబ్రాహీం షేక్ హుస్సేన్, మొహ్మద్ ఉస్మాన్ షేక్, షేక్ ఉస్మాన్ మాన్ఖాన్, మొహ్మద్ సయీద్ మొహ్మద్ ఇషాక్లను టాడా కోర్టు దోషులుగా నిర్ధారించింది.
పేలుళ్ల కుట్రలో పాల్గొన్నందుకు, ఆయుధ శిక్షణ కోసం దుబాయ్ మీదుగా పాకిస్థాన్ వెళ్లినందుకు టాడా కోర్టు ఆ ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది. టైగర్ మెమెన్ సూచన మేరకు వీరు ఆయుధాలను, పేలుడు సామగ్రిని ఉపయోగించే తీరుపై, కారు బాంబులను తయారు చేసే తీరుపై శిక్షణ పొందడానికి దుబాయ్ మీదుగా పాకిస్థాన్కు వెళ్లారనేది ఆరోపణ. తీర్పు వెలువడిన వెంటనే వారి బెయిల్ బాండ్లను రద్దు చేసి వారిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇంతకు ముందు నలుగురు మెమెన్ కుటుంబ సభ్యులతో సహా 20 మందిని ఈ కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించింది.