ఐయంజి భూములపై కూడా సిబిఐ దర్యాప్తు
హైదరాబాద్: ఐయంజి భూముల అప్పగింత వ్యవహారంపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐయంజికి 850 ఎకరాల భూమిని కేటాయించారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను చంద్రబాబు ప్రభుత్వం ఐయంజికి లక్ష రూపాయలకే అప్పగించిందని, ఈ వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఉద్దేశంతో సిబి ఐ విచారణకు ఆదేశించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ భూముల కేటాయింపును రద్దు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.
భూముల కేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. హైదరాబాద్ రింగ్ రోడ్డుపై వస్తున్న ఆరోపణలపై విచారణకు వెనక్కి తగ్గ కూడదని మంత్రివర్గం భావించింది. తెలంగాణకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఉద్దేశించిన 610 జీవోపై గిర్గ్లానీ కమీషన్ నివేదికను యధాతథంగా వెంటనే అమలు చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఈ జీవో అమలును ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవడానికి అసైన్డ్ ల్యాండ్ ప్రొహిబిషన్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.