రాజకీయ కుట్రతో నాపై ఆరోపణలు: పొన్నాల
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు భూముల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. తన కుటుంబ సభ్యులు జరిపిన లావాదేవాలను తనకు ఆపాదించి ఆరోపణలు చేయడం కుట్రేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తన పెద్ద కుమారుడు, తన చిన్న కోడలు రింగ్ రోడ్డు సమీపంలో భూమి లావాదేవీలు జరిపిన మాట వాస్తవమేనని, అయితే వాటికి నోటిఫికేషన్ విడుదలకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ కుమారులిద్దరు వారి భార్యలతో అమెరికాలో వుంటున్నారని, వారు మేజర్లు అని, వారు సొంతంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారని, వాటితో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు.
తమ పిల్లలు జరిపిన క్రయవిక్రయాల్లో తనను మంత్రిగా ఆభాసు పాలు చేయడానికి ఒక పత్రిక ప్రయత్నించిందని ఆయన అన్నారు. రాజకీయ కుట్రలకు అనుగుణంగా ఒక తెలుగు దినపత్రిక సంపాదకుడు, న్యాయవాది వ్యవహరించి, తనపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. జలయజ్ఞంలో తమ ఉనికిని కోల్పోతామనే నిస్పృహలో ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని, వాటిని తాము సమర్థంగా ఎదుర్కుంటున్నామని, దీంతో తమపై కక్ష సాధింపునకు దిగారని ఆయన అన్నారు. తమ కుటుంబసభ్యులు జరిపిన లావాదేవీలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. అయినా ఒక ఆరోపణ చేసే ముందు నిజమా, కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి తమను సంద్రించాల్సిన అవసరం లేదా అని ఆయన అడిగారు.