రాతప్రతులకు డిజిటల్ లైబ్రరీ: రాజ్యలక్ష్మి
హైదరాబాద్: ప్రాచీన రాత ప్రతులను భద్రపరిచేందుకు డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రాథమి విద్యాశాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన ప్రాచీన రాతప్రతులను డిజిటల్ లైబ్రరీలో భద్రపరుస్తారని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల 63 వేల రాతప్రతులు సేకరించినట్లు ఆమె తెలిపారు. రాతప్రతులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.
పాఠశాలల్లో ఎస్సి, ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులను ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తామని ఆమె చెప్పారు. కంటెంజెన్సీ పోస్టులను క్రమబద్దీకరిస్తామని ఆమె చెప్పారు. వివిధ చర్యల ద్వారా పాఠశాలల్లో పరిస్థితులను మెరుగు పరుస్తామని ఆమె అన్నారు.