610 జీవో అమలుపై కోర్టు ధిక్కారం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఉద్దేశించిన 610 జీవోను అమలు చేయకపోవడంపై ప్రభుత్వం మీద కోర్టు ధిక్కారం కింద కేసు వేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చెప్పారు. 610 జీవో అమలుపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులను, శాసనసభలో ఇచ్చిన హామీలను, మంత్రివర్గ నిర్ణయాలను అమలు చేయని ప్రభుత్వం ఇంకేం చేస్తుందని ఆయన అడిగారు.
హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్లో స్థానికేతరులను తొలగించడానికి దసరా తెల్లారే చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 610 జీవోను అమలు చేయడానికి ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 610 జీవో అమలు కోసం తాము ధర్నాలు చేపడతామని, అప్పటికీ ప్రభుత్వం కదిలిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, సమస్యలపై కూడా తాము ఎప్పటికప్పుడు అందోళనలు చేపడతామని ఆయన చెప్పారు. మున్సిపాలిటీలకు నిధులను విడుదల చేయడంలో కూడా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులైతే ప్రభుత్వం మోకాలి మీద పడిచి వస్తుందని ఆయన అన్నారు.