సూర్యప్రభవాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దేవమైన శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు సూర్యప్రభ వాహనంపై ఊరేగాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారు సూర్యప్రభ వాహనంపై సర్వ అలంకారభూషితుడై నాలుగు తిరుమాడ వీధుల మీదుగా ఊరేగాడు. ఆనంద నిలయుడైన మలయప్ప స్వామి అఖిల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యునికి తానే అధిపతినని చాటూ దర్శనమివ్వడంతో భక్తులు తన్మయత్వం చెందారు. రాత్రికి స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతాడు.
తిరుమల భక్త సందోహంతో కిటకిటలాడుతోంది. తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం కావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు వేలాదిగా వచ్చారు. రెండో క్యూ కాంప్లెక్స్ దాటిపోయి భక్తులు బయట బారులు తీరారు. టోకెన్లు తీసుకుంటే భక్తులకు దర్శన కోసం మూడు రోజులు పడుతోంది. దీంతో ఉచిత దర్శనం కోసం భక్తులు క్యూ కాంప్లెక్స్లో వెళ్తున్నారు. దీంతో దేవస్థానం అధికారులు మహాలయ దర్శనం అమలు చేస్తున్నారు.