సమ్మెకు ఆర్టీసి కార్మికుల సంఘం నోటీసు
హైదరాబాద్: వేతన సవరణకు డిమాండ్ చేస్తూ ఆర్టీసి కార్మిక సంఘం మంగళవారం సమ్మె నోటీసు ఇచ్చింది. తమ సమ్మె నోటీసును నేషనల్ మజ్దూర్ యూనియన్ (యన్యంయు) ఆర్టీసి యాజమాన్యానికి ఇచ్చింది. వేతన సవరణలో తమకు 35 శాతం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె నోటీసు ఇచ్చినట్లు యన్యంయు ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య చెప్పారు. ఆర్టీసి ఆర్థిక పరిస్థితిని వివరించిన తర్వాత తాము 18 శాతం పెంపునకు అంగీకరించామని, అయితే యాజమాన్యం 6 శాతం కూడా విడుదల చేయలేదని ఆయన అన్నారు.
తాము 21 రోజులు వేచి చూశామని, అనివార్య పరిస్థితులో నోటీసు ఇచ్చామని ఆయన చెప్పారు. తమ సంఘానికి చెందిన లక్షా 18 వేల మంది కార్మికులు సమ్మెకు దిగుతారని ఆయన అన్నారు. అయితే యన్యంయు తమను సంప్రదించకపోవడం పట్ల ఇతర ఆర్టీసి కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. తమను సంప్రదించుకుండా యన్యంయు ఏకపక్షంగా సమ్మె నోటీసు ఇవ్వడం సరి కాదని ఆ సంఘాలు అంటున్నాయి. అయితే తమది గుర్తింపు పొందిన సంఘమని, సమ్మె చేసే హక్కు తమకే ఉంటుందని లక్ష్మయ్య అంటున్నారు.