వైయస్ గాలికి కొట్టుకుపోతారు: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీరు మార్చుకోకపోతే గాలికి కొట్టుకుపోతారని తెలుగుదేశం పార్టీ నాయకులు కడియం శ్రీహరి, రావుల చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. నియంతలు, ముఠానాయకులు, అప్రజాస్వామిక వాదులు గాలికి కొట్టుకుపోయారని, ఆ జాబితాలో రాజశేఖర రెడ్డి కూడా చేరిపోతారని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశఃలో అన్నారు.
దసరా పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాసిన బహిరంగ లేఖ అబద్ధాల పుట్ట అని వారు విమర్శించారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ప్రభుత్వంపై ప్రజలను నమ్మించేందుకు రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తున్నారని వారన్నారు. ప్రతిపక్షాలు కుంభకర్ణ నిద్ర పోతున్నాయని రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యను వారు ఖండించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పని చేశామని, ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నామని వారు చెప్పారు. ఈ ప్రభుత్వం లాల్బహదూర్ స్టేడియాన్ని కూడా అమ్ముకుంటుందని, హుస్సేన్సాగర్ నుంచి నీళ్లు తోడేసి కూడా అమ్ముకునేట్టుందని వారు వ్యాఖ్యానించారు.