అర్ధరాత్రి వేటకు వచ్చిన డియస్పి నిర్బంధం
నిజామాబాద్: రాత్రి వన్యప్రాణుల వేటకు వచ్చిన కామారెడ్డి డియస్పి సలీముద్దీన్ను, అతని వెంట వున్న వ్యక్తులను సదాశివనగర్ మండలం కల్వరాల గ్రామస్థులు నిర్బంధించారు. కల్వరాల సమీపంలోని అటవీ ప్రాంతంలో సలీముద్దీన్ వన్యప్రాణుల వేటకు సివిల్ దస్తుల్లో వెళ్లారు. అతని వెంట వున్న ప్రైవేట్ వ్యక్తుల వద్ద మారణాయుధాలున్నాయి. దీంతో రాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పేంత వరకు వదిలేది లేదంటూ గ్రామస్థులు వారిని నిర్బంధించారు. దొంగలను పట్టుకోవడానికి వచ్చానని చెప్పి తప్పించుకోవడానికి సలీముద్దీన్ ప్రయత్నించారు. అయితే ఆయన పప్పులేం ఉడకలేదు. ఎట్టకేలకు ఓయస్డి జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో గ్రామస్థులు వారిని డియస్పిని వదిలిపెట్టారు.
రాత్రిపూట మారణాయుధాలు గల ప్రైవేట్ వ్యక్తులతో ఎందుకు వచ్చారని మీడియా ప్రతినిధులకు డియస్పి సలీముద్దీన్ సరిగా జవాబు చెప్పలేక నీళ్లు నమిలారు. దొంగలు తిరుగుతున్నారనే సమాచారం అందడంతో గస్తీకి వచ్చానని ఆయన చెప్పారు. మీతో మీ పోలీసులు ఎందుకు లేరని అడిగితే డ్రైవర్, గన్మన్ తనతో ఉన్నారని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తి మీతో ఎందుకున్నారని అడిగితే అతను గైడ్ అని చెప్పారు. అతని వద్ద కత్తులెందుకున్నాయంటే ఆయన సరిగా సమాధానం చెప్పలేకపోయారు. అర్థరాత్రి వేటకు వెళ్లిన డియస్పిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) చెప్పారు.