పోలవరం అడ్డంకులు తొలుగుతాయి: సోజ్
న్యూఢిల్లీ: గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు అడ్డంకులన్నీ తొలగిపోతాయని కేంద్ర జల వనరుల మంత్రి సైఫుద్దీన్ సోజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను గుర్తించడానికి సంయుక్త సర్వే నిర్వహిస్తామని ఆయన బుధవారంనాడు చెప్పారు. గోదావరినదిపై తలపెట్టిన మరో ప్రాజెక్టు ఇచ్చంపల్లిని సంయుక్త కార్యాచరణ బోర్దు ఆధ్వర్యంలో నిర్మిస్తామని ఆయన చెప్పారు.
బుధవారం జరిగిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తన వాదనలు వినిపించారు. ఈ సమావేశానికి ఛత్తీస్ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. ఛత్తీస్ఘడ్ నీటి పారుదల శాఖ మంత్రి, నీటి పారుదలు ఉన్నతాధికారి పాల్గొన్నారు. సమావేశం మధ్యలో లేచిపోయి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీస్ఘడ్ నుంచి ఏ విధమైన అభ్యంతరాలు లేవని రాజశేఖర రెడ్డి చెప్పారు. ఒరిస్సా రాష్ట్రం మాత్రమే అభ్యంతరాలు తెలియజేస్తోందని ఆయన చెప్పారు.