1993 పేలుళ్లు: మరో ముగ్గురు దోషులు
ముంబాయి: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో మరో ముగ్గురిని టాడా కోర్టు శుక్రవారంనాడు దోషులుగా నిర్ధారించింది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు, కుట్రలో పాలు పంచుకున్నందుకు టైగర్ మెమెన్ అనుచరులు ముగ్గుర్ని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దీంతో ఇప్పటి వరకు టాడా కోర్టు పేలుళ్ల కేసులో 31మందిని దోషులుగా నిర్ధారించింది. షేక్ అలీ షేక్ ఉమర్, మొహమ్మద్ షాహిద్ నిజాముద్దీన్ ఖురేషీ, పర్వేజ్ మొహమ్మద్ పర్వేజ్ జుల్ఫికర్ ఖురేషీలను టాడా కోర్టు శుక్రవారంనాడు దోషులుగా నిర్ధారించింది.
పేలుళ్లకు జరిగిన కుట్రలో పాలు పంచుకున్నందుకు, ఆర్డియక్స్ను రాయఘడ్ జిల్లా షేఖాదికి తరలించినందుకు, వాహనాల్లో ఆర్డియక్స్ను వాహనాల్లో నింపినందుకు, తదితర కార్యకలాపాలకు ఉమర్ను కోర్టు దోషిగా నిర్ధారించింది. రాయఘడ్లోని సంధేరి, బోర్ఘాట్లలో ఆయుధ శిక్షణ పొందాడనే అభియోగంలో అతన్ని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. షేఖాడికి ఆయుధాలు, పేలుడు పదార్థాలు చేరవేసిన అభియోగంలో ఖురేషిని కోర్టు దోషిగా నిర్ధారించింది. కుట్రలో పాలు పంచుకున్నందుకు, ఆయుధాలను, పేలుడు పదార్థాలను చేరవేసినందుకు, పాకిస్థాన్లో ఆయుధ శిక్షణ పొందినందుకు, ఆర్డియక్స్ను వాహనాల్లో నింపినందుకు జుల్ఫికర్ ఖురేషిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇప్పటి వరకు కోర్టు 13 మందిని ఈ కేసులో నిర్దోషులుగా ప్రకటించింది.