ఉప ఎన్నికల్లో పోటీ చేయం: రాఘవులు
నెల్లూరు: వచ్చే కరీంనగర్, బొబ్బిలి లోక్సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనేది నిర్ణయించుకుంటామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లాల సమీక్షా సమావేశాలు ప్రహసమని, ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ముఖ్యమంత్రి జిల్లా యాత్రలు చేపట్టారని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయకుండా సమీక్షలు నిర్వహించడం వల్ల ప్రయోజనం లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిబిఐ చేత దర్యాప్తు అనేది నాటకమని, కాలయాపన చేయడానికేనని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని కుంభకోణాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందని, ఆర్ఠిక మండళ్ల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. ల్యాండ్ మాఫియాలాగా ప్రభుత్వం బెదిరింపు విధానాలను అవలంబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.