వైయస్ ప్రసంగానికి విద్యార్థుల బ్రేక్
అనంతపురం: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రసంగాన్ని ఎఐయస్యఫ్ కార్యకర్తలు ఆదివారంనాడు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయంలో అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వారు ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. విశ్వవిద్యాలయం సిల్వర్ జూబిలీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం రాజశేఖర రెడ్డి ప్రసంగించడం మొదలు పెట్టారు. ఈ సమయంలో విద్యార్థి సంఘం కార్యకర్తలు ఆయనకు అడ్డు తగిలారు.
ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుతగిలిన విద్యార్థులను పోలీసులు బయటకు గెంటివేశారు. అనంతరం ధర్నాకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అవినీతికి పాల్పడిన విశ్వవిద్యాలయం అధికారులను ప్రభుత్వం వెనుకేసుకోస్తోందని ఆందోళనకారులు విమర్శించారు. సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని, అటువంటి అవకాశం ఉన్నప్పుడు తన ప్రసంగాన్ని అడ్డుకోవడం మంచిది కాదని ముఖ్యమంత్రి అన్నారు.