ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ఒకటే: బాబు
హైదరాబాద్: డెంగీ, చికన్ గన్యా వ్యాధులను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ వ్యాధులను నివారించడానికి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో విఫలమైందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ప్రజలకు మందులు అందడం లేదని, వైద్యులు కూడా అందుబాటులో లేరని ఆయన అన్నారు. పారిశుధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు.
రాష్ట్ర హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఆయన డిమాండ్ చేశారు. హెల్త్ ఎమర్జెన్సీ విధించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించామని ఆయన అన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ విధించడం వల్ల ప్రజలకు వైద్య సేవలు అందే అవకాశం వుంటుందని ఆయన చెప్పారు. పేదవాళ్లకు వైద్య సేవలు అందకపోతే ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. డెంగీ, చికన్ గన్యా వ్యాధులు ఎంతగా ప్రబలినా ప్రభుత్వంలో కదలిక లేదని, ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదని ఆయన విమర్శించారు.