రింగ్ రోడ్డు అక్రమాలపై ఆందోళన ఉధృతం: విపక్షాలు
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు అంగీకరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రతిపక్షాల నాయకులు చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ వారు సోమవారం గవర్నర్ కార్యదర్శికి ఒక వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 12వ తేదీన అన్ని జాతీయ రహదారులను దిగ్బంధం చేయనున్నట్లు వారు తెలిపారు.
అసైన్ భూముల చట్ట సవరణ ఆర్డినెన్స్కు అనుమతి ఇవ్వకూడదని వారు గవర్నర్ను కోరారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాలపై విడిగా విచారణ జరిపించాలని తాము కోరినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి మీడియా ప్రతినిధులతో చెప్పారు. అక్రమాలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు అవుటర్ రింగ్ రోడ్డు పనులు ఆపేయాలని, భూసేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలని, నోటిఫికేషన్ అనంతరం జరిగిన భూ క్రయవిక్రయాల లావాదేవీలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.