ఓటమితో దిగజారిన సానియా ర్యాంక్
న్యూఢిల్లీ: తాష్కెంట్ టెన్నిస్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో తనకన్నా తక్కువ ర్యాంక్ గల రష్యా క్రీడాకారిణి ఓల్గా పుచుకోవా చేతిలో ఓటమికి హైదరాబాద్ సంచలనం సానియా మీర్జా మూల్యం చెల్లించక తప్పలేదు. ఈ ఓటమితో ప్రపంచ ర్యాంకింగ్లో ఆమె ఆరు స్థానాలను కోల్పోయింది. డబ్ల్యుటిఎ ర్యాంకింగ్లో ఆమె ప్రస్తుతం 61వ స్థానానికి దిగజారింది. ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ మార్టినా హింగిస్ను ఓడించి తన ర్యాంక్ను మెరుగు పర్చుకుని 55వ స్థానం పొందిన సానియా పుచుకోవా చేతిలో ఓటమితో ఆరు స్థానాలు కోల్పోయింది.
అయితే డబుల్స్లో మాత్రం సానియా ర్యాంకింగ్లో మార్పు లేదు. గత మూడు వారాలుగా ఆమె 26వ స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఇతర భారతీయ క్రీడాకారిణులు శిఖా ఒబెరాయ్, అంకిత బాంబ్రీ, ఈషా లఖాని తమ ర్యాంక్లను స్వల్పంగా మెరుగుపరుచుకున్నారు. రుష్మీ చక్రవర్తి మాత్రం ఒక స్థానాన్ని కోల్పోయింది. పురుషుల డబుల్స్ భారత క్రీడాకారుడు లియాండ్ పేస్ పదవ స్థానంలో ఉన్నాడు. మహేష్ భూపతి 26వ స్థానంలో ఉన్నాడు.