వైయస్ రాజీనామాకు చంద్రబాబు డిమాండ్
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డికి ప్రసాదించిన క్షమాబిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. గౌరు వెంకటరెడ్డి క్షమాబిక్షకు సిఫార్సు చేసిన అప్పటి గవర్నర్ సుశీల్కుమార్ షిండే కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే సుశీల్కుమార్ షిండేను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను కోరారు.
గౌరు వెంకటరెడ్డికి క్షమాబిక్ష పెట్టడంలో ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవని, రాజకీయ కారణాలతోనే గౌరుకు క్షమాబిక్ష పెట్టారని ఆయన అన్నారు. వెంకటరెడ్డికి క్షమాబిక్ష ప్రసాదించిన వ్యవహారంపై విచారణ జరిపించి అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. వెంకటరెడ్డికి క్షమాబిక్ష పెట్టడంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆయన విమర్శించారు. ఈ చర్య వల్ల గవర్నర్ వ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని ఆయన గుర్తు చేశారు.