సుప్రీం తీర్పు శిరసా వహిస్తాం: జానారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష విషయంలో సుప్రీంకోర్టు తీర్పు శిరసా వహిస్తామని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. నేరస్థులకు క్షమాభిక్ష పెట్టే విషయంలో ఇక ముందు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టే విషయంలో తాను రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించానని ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సుశీల్కుమార్ షిండే ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ ప్రతినిధితో ఢిల్లీలో అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తాను శిరసా వహిస్తానని ఆయన చెప్పారు. సర్వోన్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తాను వ్యాఖ్యానించడం సరి కాదని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తనకు కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డినుంచి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి నుంచి ప్రాణహానీ ఉన్నదన తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామిరెడ్డి అన్నారు. గౌరు వెంకటరెడ్డి క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి తనకు బెదిరింపు ఫోన్కాల్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. తనకు తగిన రక్షణ కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను సవాల్ చేస్తూ రఘురామిరెడ్డి కోర్టు పిటిషన్ వేశారు. గౌరు వెంకటరెడ్డికి పెట్టిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసిన దృష్ట్యా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) డిమాండ్ చేసింది.