గౌరు క్షమాభిక్ష రద్దు: వైఎస్ సర్కారుకు షాక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు గౌరు వెంకటరెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రసాదించిన క్షమాభిక్షను బుధవారం ఉదయం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ సంచలనాత్మక తీర్పు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ఇబ్బందుల్లో పడేసింది. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన గౌరు వెంకటరెడ్డి ఇద్దరు ప్రత్య్రర్ధుల హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గౌరు వెంకటరెడ్డిని ఆనాటి తెలుగు దేశం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా హత్య కేసులో ఇరికించిందని స్వయంగా ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేక సార్లు వ్యాఖ్యానించారు. యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్న గౌరు వెంకటరెడ్డిని ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖరెడ్డి జైలుకు వెళ్ళి పరామర్శించారు. టీవీ ఛానల్స్ ఈ ఉదంతాన్ని కవర్ చేశాయి. నేరచరితుడైన గౌరు వెంకటరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి వీలు కాకపోవడంతో వెంకటరెడ్డి భార్య గౌరు చరితారెడ్డికి టికెట్ ఇవ్వగా ఆమె నందికొట్కూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
రాజ్యాంగ పరమైన కారణాల ప్రాతిపదికగా కాకుండా, కుల, మతం, వర్గం ప్రాతిపదికగా రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ నిర్ణయాలు తీసుకోరాదని నేడు వెంకటరెడ్డి కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యావజ్జీవ శిక్ష పడిన గౌరు వెంకటరెడ్డికి అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సుశీల్ కుమార్ షిండే క్షమాభిక్ష ప్రసాదించారు. వైఎస్ నాయకత్వంలోని కేబినెట్ సమావేశం చేసిన సిఫార్సు, కర్నూలు జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గౌరు వెంకటరెడ్డి మరోసారి ఈ కేసు విషయంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు ( ఇప్పటి గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్) విన్నవించుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించింది.