వైయస్ రాజీనామాకు రాజభవన్ వద్ద టిడిపి ధర్నా
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాజభవన్ వద్ద ధర్నా చేశారు. రాజభవన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. గౌరు వెంకటరెడ్డి క్షమాబిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మను ఆందోళనకారులు దగ్ధం చేశారు. రాజ్యాంగ విలువను మంట గలిపిన రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని టిడిపి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. హంతకులకు క్షమాభిక్ష పెట్టి ముఖ్యమంత్రి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నాగం జనార్దన్ రెడ్డిని, సాయన్నను తదితరులను అరెస్టు చేశారు. అయితే కార్యకర్తలు పోలీసు వాహనాలకు అడ్డం పడ్డారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ నేత నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.