నాకు ప్రాణహాని: పరిటాల హత్య కేసు నిందితుడు
అనంతపురం: తనకు సహనిందితుల నుంచి ప్రాణహాని ఉందని తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు రామ్మోహన్ రెడ్డి కోర్టుకు తెలియజేసుకున్నారు. ఈ కేసులో రామ్మోహన్ రెడ్డి అప్రూవర్గా మారాడు. పరిటాల రవి హత్య కేసులో నిందితులను గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. తనకు రక్షణ కల్పించాలని అప్రూవర్గా మారిన రామ్మోహన్ రెడ్డి కోర్టును కోరారు. తనను మిగతా నిందితులకు దూరంగా వేరే జైలులో ఉంచాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. తన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని ఆయన మొరపెట్టుకున్నారు. మద్దెలచెర్వు సూరి ఎదుటే రామ్మోహన్ రెడ్డి జడ్డికి మొర పెట్టుకున్నారు.
పరిటాల రవి హత్య కేసులో నిందితులకు ఆశ్రయం కల్పించడాని రామ్మోహన్ రెడ్డి అభియోగం ఎదుర్కుంటున్నారు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితులు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి, మొద్దు శీనులకూ, రామ్మోహన్ రెడ్డికి మధ్య చాలా కాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. తమను అనంతపురం జైలుకు తరలించాలని మొద్దు శీను తదితరులు కోరుతుండగా తాను చర్లపల్లి జైలులోనే ఉంటానని రామ్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు. తాను ఈ కేసులో అప్రూవర్గా మారుతానని నెల రోజుల క్రితం రామ్మోహన్ రెడ్డి పిటిషన్ పెట్టుకున్నారు.