ఫ్యాక్షనిస్టును కాను, వైఎస్ తప్పులేదు:వెంకటరెడ్డి
హైదరాబాద్: తాను ఫ్యాక్షనిస్టును కానని, కోర్టు తన ప్రవర్తనను తప్పు పట్టలేదని క్షమాభిక్ష విషయంలో వివాదాస్పదుడైన కాంగ్రెస్ నాయకుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. ఒక తెలుగు టీవీ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. శిక్షపడినప్పుడు కూడా తాను బాధ పడలేదని, ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ప్రతిపక్షాలు టార్గెట్ చేయడమే తనకు బాధ కలిగిస్తోందని ఆయన తెలిపారు. మరోసారి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకుంటానని గౌరు వెంకటరెడ్డి చెప్పారు.
అధికారులు చేసిన తప్పిదమే వైఎస్ను ఇబ్బందుల్లో పడేసిందని ఆయన అన్నారు. తనకు ప్రభుత్వం అండలేదని, ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలు నుంచి బయటికిఇ వచ్చి ఉండేవాడినని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ హత్య కేసులో గౌరు వెంకటరెడ్డికి పదేళ్ళ జైలు శిక్ష పడగా, రాజశేఖరరెడ్డి సిఫార్సు మేరకు గవర్నరు క్షమాభిక్ష ప్రసాదించడంతో వెంకటరెడ్డి విడుదలైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టడంతో ప్రతిపక్షాలు వైఎస్ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తున్నాయి.