ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: వెంకయ్యనాయుడు
నెల్లూరు: ఇక మీదట ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని బిజెపి అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు ఇక్కడ ప్రకటించారు. నిజానికి వెంకయ్యనాయుడు తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భాలు చాలా తక్కువ. 1978లో ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన కొన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేదు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత బిజెపి పరిస్ధితి అధ్వాన్నంగా మారింది. ఆ విషయం ఇటీవలి పంచాయితీ ఎన్నికల్లో రుజువైంది. కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్ధిని నిలబెట్టడడ దాదాపు ఖరారైనట్టే. సిహెచ్ విద్యాసాగరరావు బిజెపి అభ్యర్ధిగా అక్కడ రంగంలోకి దిగనున్నారు. తెలంగాణలో మొదటి నుంచి బలంగా ఉండిన బిజెపి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో వెంకయ్యనాయుడు అధ్యక్షుడుగా ఉండగా కప్పదాటు వైఖరి అనుసరించడంతో ఈ ప్రాంతంలో ఆ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది.