ఒరిస్సా సియం ఇంటి ముందు మేధా ధర్నా
భువనేశ్వర్: పారాదీప్లో పోస్కో ఉక్కు ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ నేతృత్వంలో వందలాది మంది ఆదివారంనాడు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసం ముందు ధర్నా చేశారు. పోస్కో ఉక్కు ప్రాజెక్టు నిర్మాణంపై బహిరంగ చర్చ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా ధర్నా చేస్తున్నా బహిరంగ చర్చకు నీవన్ పట్నాయక్ దిగిరాకపోవడంతో తాము ఆందోళనను ఉధృతం చేస్తామని మేధా పాట్కర్ శనివారంనాడు చెప్పారు. డెడ్లైన్కు ముందే రాష్ట్రీయ యువ సంఘటన్, నవనిర్మాణ్ సమితి కార్యకర్తలు వందలాది మంది నవీన్ పట్నాయక్ నివాసానికి తరలిపోయారు.
ఆందోళనకారులు వ్యూహం తెలియకపోవడంతో వారు నవీన్ నివాసానికి వెళ్లే దారికి చేరుకునే వరకు పోలీసులు పసిగట్టలేకపోయారు. తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి 50 మందిని అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంత మంది కార్యకర్తలతో వచ్చిన ముఖ్యమంత్రితో చర్చలు జరపాల్సిందిగా మేధా పాట్కర్కు ఆహ్వానం అందింది. అయితే అరెస్టయినవారిని విడుదల చేసే వరకు చర్చలు జరిపేది లేదని ఆమె పట్టుబట్టారు. ఇరు పక్షాలు దిగిరాలేదు. దీంతో ఆందోళనకారులు నవీన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోస్కో ప్రాజెక్టుకు ప్రత్యేక ఆర్థిక మండలి హోదా ఇవ్వాలనే నిర్ణయాన్ని కూడా ఆమె వ్యతిరేకించారు.