టిడిపి ఆ డిమాండ్ చేయని రోజు లేదు: రఘువీరా
విజయవాడ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటుగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీ శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డికి పెట్టిన క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసినందున ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని తెలుగుదేశం డిమాండ్ చేయడాన్ని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రతిరోజూ డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన రోజు మినహా మిగతా అన్ని రోజుల్లోనూ రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని, వారి డిమాండ్కు విలువ లేదని ఆయన అన్నారు. నకిలీ వ్యవసాయ పంటల మందులను అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. క్రిమిసంహారక మందులు అమ్మేవారి పట్ల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.