అన్నాడియంకె నుంచి రాధిక బహిష్కరణ
చెన్నై: సినీనటి రాధికను అన్నాడియంకె అధినేత జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. రాధిక ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ఆమె రద్దు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాధినకు పార్టీ నుంచి వెలి వేసినట్లు జయలలిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భర్త శరత్కుమార్తో పాటు రాధిక ఇటీవలే డియంకెను వీడి అన్నాడియంకెలో చేరారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు రాధికను బహిష్కరించినట్లు జయలలిత తాను విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
రాధిక పార్టీలో చేరడంతో సన్ నెట్వర్క్లో విజయవంతంగా నడుస్తున్న గేమ్షోలు, టీవీ సీరియళ్లు జయ టీవీకి తరలి వస్తాయని జయలలిత భావించారు. అయితే రాధిక తన గేమ్షోలను, టీవీ సీరియళ్లను సన్ నెట్వర్క్లో అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. పైగా రాధిక డియంకెతో సంబంధాలు తెగదెంపులు చేసుకోలేదని అంటున్నారు. దీంతో ఆగ్రహించిన జయలలిత రాధికపై బహిష్కరణ వేటు వేశారు. అయితే రాధిక భర్త శరత్కుమార్ను మాత్రం పార్టీ నుంచి బహిష్కరించలేదు.