కెసిఆర్ వల్ల వచ్చేది పోతుంది: ఎమ్మెస్సార్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో సాధ్యం కాదని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు అభిప్రాయపడ్డారు. జాతీయ కాంగ్రెస్, బిజెపిలతోనే తెలంగాణ రాష్ట్ర సాధన జరుగుతుందని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వల్ల వచ్చే తెలంగాణ పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంట్ వుందని, దాని వల్ల తాను గెలుస్తానని చంద్రశేఖరరావు అనుకుంటున్నారని, అది వట్టి భ్రమ అని ఆయన అన్నారు. ఒకవేళ చంద్రశేఖరరావు గెలిచినా తెలంగాణ రాదని ఆయన అన్నారు.
చంద్రశేఖరరావు విజయం సాధించడం వల్ల తెలంగాణ వస్తుందని నమ్మే వెర్రివాళ్లెవరూ లేరని ఆయన అన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ వల్లనో, బిజెపి వల్లనో తెలంగాణ వస్తుంది గానీ తెరాస వల్ల రాదని బిజెపి నేత సిహెచ్. విద్యాసాగరరావు మంచి మాట అన్నారని ఆయన గుర్తు చేశారు. ఐదుగురు తెరాస పార్లమెంటు సభ్యుల వల్ల తెలంగాణ ఎలా వస్తుందని ఆయన అడిగారు. అలా వచ్చేదయితే ఇదివరకే వచ్చేదని ఆయన అన్నారు. అయితే కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణకు అగ్ని పరీక్ష అని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అన్నారు. ఆయన మంగళవారంనాటి నుంచి కరీంనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.