అధికార పార్టీ సరళి సిగ్గుచేటు: చంద్రబాబు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలపై అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం చరిత్రలో ఇదే ప్రథమమని, ఇటువంటి ఎదురుదాడి సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించిన అంశంపై, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడడంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని తప్పులపై తాము కూడా ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ సన్నాహాలు చేసుకుంది. దీనిపై చంద్రబాబు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా దండెత్తారు. రాష్ట్రపతిని, ప్రధానిని కలిసేందుకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
తప్పుల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను వదిలేసి సిగ్గు, భయం లేకుండా ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించిన వ్యవహారంలో రాజీనామా చేయడం తప్ప ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి మరో దారి లేదని ఆయన అన్నారు. రెండున్నరేళ్లలో అధికార పార్టీ వ్యవహారం హాస్యాస్పదంగా వుందని, ప్రజలకు ఏం చేశారని తమ మీద ఫిర్యాదు చేస్తున్నారని ఆయన అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్షాలను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాలపై, గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడంపై తమ వద్ద ఆధారాలున్నాయని ఆయన అన్నారు. గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించిన అంశంపై, హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అక్రమాలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో పాటు ఎజిపి, సమాజ్వాదీ పార్టీ నాయకులు కూడా రాష్ట్రపతిని కలిసినవారిలో వున్నారు. అంతకు ముందు చంద్రబాబు ఉపరాష్ట్రపతి బైరాన్సింగ్ షేకావత్ను కలిసి ఫిర్యాదు చేశారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్దన్తో ఆయన సమావేశమయ్యారు. ఆధారాలతో సహా ముఖ్యమంత్రిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని చంద్రబాబు చెప్పారు.