కెసిఆర్కు ఓటమి భయం: ఇంద్రసేనారెడ్డి
సిద్ధిపేట: కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావుకు ఓటమి భయం పట్టుకుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. తాను ఓడిపోతాననే భయంతోనే పోటీ నుంచి విరమించుకోవాలని ఇతర పార్టీలవారిని అభ్యర్థిస్తున్నారని ఆయన గురువారం మెదక్ జిల్లా సిద్ధిపేటలో మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.
కెసిఆర్ కరీంనగర్ ఉప ఎన్నికలో ఓడిపోక తప్పదని, కెసిఆర్ గత రెండేళ్లలో తెలంగాణకు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. 610 జీవోను అమలు చేయించడానికి గానీ సాగునీటి ప్రాజెక్టులను సాధించడానికి గానీ చంద్రశేఖరరావు మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏ విధమైన ప్రయత్నం చేయలేదని ఆయన విమర్శించారు. మాటలు చెప్పి కాలం గడిపారని, అధికారాన్ని అనుభవించారని ఆయన వ్యాఖ్యానించారు.