బాబు గొర్రెలు తింటే వైయస్ బర్రెలు తింటున్నారు
కరీంనగర్: ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో గొర్రెలు తినే చంద్రబాబు పోయి బర్రెలు తినే రాజశేఖర రెడ్డి వచ్చారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గతంలో చంద్రబాబు చేసిన పనులనే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారని, తాము కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దర్వాజాలు తీసిందని చంద్రబాబు అన్నారని, చంద్రబాబు గాంధీ అస్పత్రిని అమ్మితే, రాజశేఖర రెడ్డి మెడికల్ కాలేజీని అమ్ముతున్నారని, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం బాగోతం అలా వుందని ఆయన అన్నారు.
రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భూకుంభకోణాల్లో, టెండర్ల కుంభకోణాల్లో ఇరుక్కుపోయిందని, తెలంగాణలోని భూములను, ఆస్తులను ఇష్టమొచ్చిన విధంగా అమ్ముతున్నారని ఆయన విమర్శించారు. 610 జీవో విషయంలో ప్రభుత్వం డ్రామా ఆడుతోందని ఆయన విమర్శించారు. 610 జీవో అమలు మంత్రి వర్గ తీర్మానానికే పరిమితమా అని ఆయన ప్రశ్నించారు. ఆ జీవోను అమలు చేయాలనే చిత్తశుద్ధి వుంటే పోలీసు శాఖలో అధికారులకు ప్రమోషన్లు ఇవ్వండని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా 610 జీవో విషయంలో అదే డ్రామా ఆడిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే వైయస్ ప్రభుత్వం చూస్తూ కూర్చుంటోందని ఆయన విమర్శించారు.
జలవిద్యుదుత్పత్తిని ముఖ్యమంత్రి ఆపించారని, మరో వైపు విద్యుత్ కొరత పేరుతో రైతులకు కరెంట్ సరిగా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. తప్పులను ఎత్తి చూపిన ప్రతి ఒక్కరిపై వైయస్ ఎదురుదాడికి దిగుతున్నారని, చివరికి మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీని కూడా వదలలేదని ఆయన అన్నారు. వైయస్ తెలంగాణ ఆస్తుల అమ్మకాలకు, నీళ్లదోపిడీకి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వరంగల్ జిల్లాలో పత్తిరైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, సిరిసిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి నికారించిందని, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కడియం శ్రీ।హరి, ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడేవారయ్యారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలో వున్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.