వైయస్ రాజీనామా డిమాండ్తో ప్రదర్శనలు
హైదరాబాద్: గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించిన వ్యవహారానికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద మౌన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన ప్రదర్శనలో తెలుగుదేశం నాయకులు సాయన్న, తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని వారు విమర్శించారు.
విజయవాడలో తెలుగుదేశం కార్యకర్తలు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి వేషధారణతో ఉన్న వ్యక్తిని చీపుళ్లతో కొడుతూ తమ నిరసనను తెలియజేశారు. అతన్ని కొడుతూ ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రాజీనామా చేయాలని వారు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.