కరీంనగర్ విజయానికి కుట్ర: బిజెపి
హైదరాబాద్: కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కుట్ర చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత, కరీంనగర్ బిజెపి అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగరరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన కుదిరిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇరు పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు గమనిస్తే ఆ విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు.
పరస్పరం తిట్టుకోవడం, ఊపిరాడనంతగా కౌగిలంచుకోవడం కాంగ్రెస్, తెరాస నాయకులకు అలవాటేనని ఆయన అన్నారు. బిజెపికి కరీంనగర్ నియోజకవర్గంలో బలం లేదని ఆ రెండు పార్టీలు ప్రచారం చేయడం చూస్తే అసలు విషయం అర్థమవుతుందని ఆయన అన్నారు. గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడం, పరిటాల రవి హత్య వంటి విషయాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొత్త సిఆర్పియఫ్, ఐపిసిల కోసం కేంద్రానికి సూచనలు చేసేట్లు కనిపిస్తోందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాకెట్ లాంచర్ల కేసులో ప్రధాన నిందితుడు టెక్ మధు విషయంలో డిజిపి స్వరణ్జిత్ సేన్, హోంమంత్రి కె. జానారెడ్డి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం ఆశ్చర్యకరంగా వుందని ఆయన అన్నారు.