సుప్రీం తీర్పు సరి కాదు: సిపిఐ
విశాఖపట్నం: ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా వ్యతిరేకించారు. క్రీమీలేయర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తన అధికారాలను అతిక్రమించడమేనని, క్రీమీలేయర్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటేనని, న్యాయవ్యవస్థకు ఆ అధికారం లేదని ఆయన ఆదివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. అణచివేతకు గురైనవారి మీద సుప్రీంకోర్టు తీర్పు దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు ప్రజలకు మేలుకు గొడ్డలిపెట్టు అని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఆర్థిక మండళ్ల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన విమర్శించారు. తాము ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అయితే వ్యవసాయ భూములను లాక్కోవడం అందుకు తాము వ్యతిరేకమని ఆయన అన్నారు. తాము మూడో ఫ్రంట్కు అనుకూలం కాదని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు. ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ విధానాలతో ముందుకు వచ్చే పార్టీలతో తాము ఫ్రంట్ కట్టడానికి సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు. ఏ ఫ్రంట్లో లేని పార్టీలతో ఫ్రంట్ కట్టడం తమకు వ్యతిరేకమని ఆయన అన్నారు. ఆర్థిక సంస్కరణల పేరుతో పేదల, కార్మికుల, ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విధానాలను నిరసించే పార్టీలతో కలిసి పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.