భార్య చంపి ఉడాయించిన భర్త
హైదరాబాద్: హైదరాబాద్లోని బేగంపేట ప్రాంతంలో భర్త తన భార్యను అమానుషంగా హత్య చేసిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఆదివారం ఉదయం లేచి చూసే సరికి తల్లి రక్తమడుగులో పడి వుండడం ఆమె కొడుకు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిపై కప్పి వున్న దుప్పటి తీసేసరికి ఆమె రక్తం మడుగులో వుంది. తండ్రి కనిపించలేదు. దీంతో తండ్రే హత్య చేసి వుంటాడని ఆ కొడుకు అనుమానిస్తున్నాడు. మెహన్నీరుసా బేగం మొదటి భర్త ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయాడు. దీంతో ఆమె ఇండ్లలో పాచీపని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. ఈ సమయంలో ఒక ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఫక్రుద్దీన్ బాబాతో పరిచయం అయింది. ఆ పరిచయం పెళ్లికి దారి తీసింది.
అయితే ఫక్రుద్దీన్కు ఆమె మొదటి భర్తకు పుట్టిన ముగ్గురు పిల్లలంటే గిట్టడం లేదు. ఎప్పుడూ వారిని కొట్టేవాడు. అదే సమయంలో కూతురు పెళ్లి విషయంలోనూ భార్యాభర్తల మధ్య తగాదా చెలరేగింది. దీంతో రాత్రి ఫక్రుద్దీన్ భార్య మెహన్నీరుసాను చంపి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా బిడ్డ పెళ్లి కోసం దాచిన డబ్బు కూడా కనిపించలేదు. ఆ డబ్బు తీసుకొని అతను ఉడాయించాడని భావిస్తున్నారు. అంతేకాకుండా ఫక్రుద్దీన్ మరో పెళ్లి చేసుకుని కర్ణాటకలో కాపురం పెట్టాడని అనుమానం. అతను అక్కడికే పారిపోయి వుంటాడని అనుకుంటున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.