వైయస్పై కెసిఆర్ మరోసారి ధ్వజం
హైదరాబాద్: కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో తమ పార్టీ కింది స్థాయి కార్యకర్తలను కూడా ప్రలోభపెట్టేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, కరీంనగర్ తెరాస అభ్యర్థి కె. చంద్రశేఖరరావు విమర్శించారు. తెరాసకు ఓటేసేందుకు ప్రజలు ముందుకు వస్తుంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్వారు తమ కార్యకర్తలను ప్రలోభపెడుతున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. పార్టీ కార్యదర్శి కోలా జనార్దన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ జాగరణ సమితి కమాండర్ భాస్కర రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పటికే 30 గ్రామాల ప్రజలు తమకు ఓటేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారని, ఓటర్ల ఆవేశపూరిత ఐక్యతను, తెలంగాణ స్ఫూర్తిని చూసి కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోందని ఆయన అన్నారు. ఈ స్థితిలో తమను ఓడించేందుకు ఎత్తుగడలు వేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని స్థానికేతర పోలీసులను బదిలీ చేయకపోతే ముఖ్యమంత్రి నివాసం ముందు ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.