తెలంగాణపై సోనియాకు ప్రేమ: వైయస్
మెదక్: తెలంగాణ విషయంలో తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విశ్వసనీయతను శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులను ప్రలోభపెడుతున్నామనడం తమపై నిందలు మోపడమేనని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలో ఆయన సోమవారంనాడు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ విషయంలో తాము సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి వుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో నిర్ణయం ప్రకటించడానికి సమస్యలు చాలా వున్నాయని, తెలంగాణపై అన్ని పార్టీలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు.
తెలంగాణ వెనకబాటుతనంపై దృష్టి పెట్టి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తమను సోనియా గాంధీ స్పష్టంగా ఆదేశించారని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నాయకుడికి కల్పించాల్సిన పూర్తి భద్రతను నారా చంద్రబాబునాయుడికి కల్పించాలమని, ఒక హైదరాబాద్లోని 153 మందితో చంద్రబాబుకు రక్షణ కల్పించామని ఆయన చెప్పారు. న్యాయపరమైన సమస్యలను అధిగమించి విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయుధాలు వీడితే నక్సలైట్లతో చర్చలు జరపడానికి తాము ఎప్పుడైనా సిద్ధమేనని ఆయన అన్నారు.