పోలీసుల అదుపులో మావోయిస్టు నేత సుధాకర్?
విశాఖపట్నం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ వెంకటాచలంను రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను పోలీసులు ధృవీకరించడం లేదు. సుధాకర్ లొంగిపోవడానికి సిద్ధంగా వున్నానని సమాచారం అందించడాని, అందుకు తాము రంగం సిద్ధం చేస్తున్నామని హోం మంత్రి కె. జానారెడ్డి నల్లగొండలో మీడియా ప్రతినిధులతో స్పష్టంగా చెప్పారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి సుధాకర్కు సంబంధించిన సమాచారం తన వద్ద ఏదీ లేదని, ఇంతకు ముందు తప్పుగా ప్రకటించానని ఆయన చెప్పారు.
అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ విశాఖ - తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దుల్లో విశ్రాంతి తీసుకున్నట్లు పోలీసులకు కచ్చితమైన సమాచారం అందిందని, కొయ్యూరు మండలం పాతకోట - పెదలంక అటవీ ప్రాంతంలోని 1300 అడుగుల ఎత్తున్న కొండపై సుధాకర్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ కొండను చుట్టుముట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుధాకర్ కోసం తాము గాలింపు చేపట్టడం లేదని విశాఖపట్నం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ మురళి చెప్పారు. సుధాకర్ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో వున్నట్లు కూడా తమకు సమాచారం లేదని ఆయన అన్నారు. లైట్ మెషిన్గన్ లభించడంతో మావోయిస్టు అగ్రనేత ఎవరైనా వుండవచ్చునని అనుమానించారని ఆయన అన్నారు. అయితే సుధాకర్ పోలీసుల అదుపులో లేడని, అతను లొంగిపోయేందుకు సిద్ధపడుతున్నారని వినిపిస్తోంది.