మధు లొంగుతాడు: సుధాకర్ మా వద్ద లేడు
నల్లగొండ: రాకెట్ లాంచర్ల కేసులో ప్రధా నిందితుడు టెక్ మధు లొంగిపోయేందుకు సిద్ధంగా వున్నాడని రాష్ట్ర హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. మధ్యవర్తి ద్వారా తమకు టెక్ మధు లొంగుబాటుకు సిద్ధంగా వున్నాడని సమాచారం అందిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మధు లొంగుబాటుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. మావోయిస్టు ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు కమిటీ కార్యదర్శి సుధాకర్ తమ వద్ద లేడని ఆయన స్పష్టం చేశారు. అయితే సుధాకర్ లొంగుబాటుకు సిద్ధంగా వున్నాడని హోం మంత్రి ముందు ప్రకటించారు. కానీ ఆ విషయాన్ని పొరపాటుగా ప్రకటించానని ఆయన సర్దుకున్నారు.సుధాకర్ తమ అదుపులో లేడని, లొంగిపోతాడన్న సమాచారం కూడా లేదని ఆయన మరోసారి చెప్పారు.
నక్సల్స్ సమాచారం ఎవరు ఇచ్చిన తీసుకుంటామని, అందుకు తగిన పారితోషికం కూడా ఇస్తామని జానారెడ్డి చెప్పారు. సుధాకర్ను పోలీసులు చుట్టుముట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా సుధాకర్ పోలీసుల చేతికి చిక్కినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వదంతులను పోలీసులు ధృవీకరించడం లేదు. సుధాకర్ ఇంతకు ముందు పోలీసుల నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆయన ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ అప్పటి కార్యదర్శి రామకృష్ణతో పాటు పాల్గొన్నాడు.