రాజయ్య భూములు స్వాధీనం చేసుకోవాలి: సిపిఐ
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు ఆకుల రాజయ్య అక్రమంగా కొనుగోలు చేసిన 14వేల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. దౌర్జన్యాలతో, వివిధ అక్రమాలతో బలవంతంగా సంతకాలు చేయించుకుని రాజయ్య హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 14 వేల ఎకరాలు సొంతం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. భూములను స్వాధీనం చేసుకుని ఎవరి భూములను వారికి అప్పగించాలని నారాయణ డిమాండ్ చేశారు. గిరిజనుల నుంచి, హరిజనుల నుంచి అక్రమంగా రాజయ్య కొనుగోలు చేశాడని ఆయన ఆరోపించారు.
హరిజనులకు, గిరిజనులకు సంబంధించిన భూములను వారికి అప్పగించిన తర్వాత మిగిలిన భూములను పేదలకు పంపిణీ చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. భూముల స్వాధీనానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే తామే ఆ భూములను స్వాధీనం చేసుకుని పంపిణీ చేస్తామని ఆయన హెచ్చరించారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని భూములపై గుత్తాధిపత్యానికి ఆకుల రాజయ్య ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆకుల రాజయ్య అక్రమ పద్ధతుల వెనక పలువురు పెద్దలున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి.