రాజయ్య భూకొనుగోళ్లపై విపక్షాల ధ్వజం
హైదరాబాద్: రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఆకుల రాజయ్య 14 వేల ఎకరాలను కొనుగోలు చేసిన వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. భూముల వ్యవహారానికి సంబంధించి క్రిమినల్ కేసులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయరామారావు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్లన్నీ రద్దు చేసి ఎవరి భూములు వారికి ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో పెద్దయెత్తున అవినీతి చోటు చేసుకుందని, అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఈ భూముల వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దల హస్తం వుందని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. వాస్తవాలు వెల్లడి కావడానికి ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒక వ్యక్తికి 14 వేల ఎకరాలు కొనడానికి అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, భూసంస్కరణలకు వ్యతిరేకంగా ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయి వంటి అనేక ప్రశ్నలు ఈ వ్యవహారంలో వున్నాయని ఆయన అన్నారు. ఈ సంఘటనలో రాజయ్యపై, అధికారులపై, ఇతరులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజయ్య కొనుగోలు చేసిన భూములను స్వాధీనం చేసుకుని ఎవరివి వారికి ఇచ్చివేయాలని బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. తెలంగాణలోని భూములను ప్రయత్నపూర్వకంగానే రాజశేఖర రెడ్డి అన్యాక్రాంతం చేస్తూ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ కుంభకోణాన్ని బయట పెట్టిన ప్రైవేట్ టీవీ చానల్ ప్రతినిధితో చెప్పారు. భూముల లావాదేవీల వ్యవహారంలో రిజిస్ట్రేషన్ల శాఖ తప్పేమీ లేదని ఆయన అన్నారు.