తెలంగాణ ముఖచిత్రమే మారుతుంది: ప్రధాని
మహబూబ్నగర్: నీటి పారుదల రంగంలో వెనకబడిన తెలంగాణ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన కార్యక్రమం వల్ల అన్ని ప్రాంతాల కన్నా ముందడుగు వేస్తుందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ముందు చూపు వల్ల రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాలన్నింటికీ, రాష్ట్రంలోని మూలమూలకు సేద్యం నీరు అందించే బృహత్తర సాగునీటి పథకాలు చేపట్టారని, తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కొద్ది కాలంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్రాల సరసన చేరుతుందని ఆయన అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులకు గురువారంనాడు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా కేంద్రం మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.
భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, వచ్చే పది, ఇరవై యేళ్లలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశం నిలబడుతుందని, ఆంధ్రప్రదేశ్ జాతకమే మారిపోతుందని ఆయన అన్నారు. రోడ్లకు, ఉపాధి కల్పనకు, నీటి పారుదల రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన జరుగుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ది ముఖ్యమైన పాత్ర అని, అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాము కృతజ్ఞతాబద్ధులమై వున్నామని ఆయన చెప్పారు. వెనకబడిన తెలంగాణలో మరింతగా వెనకబడిన మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేయడానికి తమ శాయశక్తులా కృషి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖ రెడ్డి హామీ ఇచ్చారు. కల్వకుర్తి, బీమా ప్రాజెక్టుల మధ్య గల భూములకు సేద్యం నీటి సౌకర్యం కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు టి. ఆర్. బాలు, ఎస్. జైపాల్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు, పార్లమెంటు సభ్యుడు విఠల్రావు, శాసనసభ్యుడు జి. చిన్నారెడ్డి, రాష్ట్ర మంత్రి జి. వినోద్ తదితరులు పాల్గొన్నారు.