వరద మృతులు 11 మంది: కృష్ణార్పణం
హైదరాబాద్: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మచిలీపట్నం వెళ్లే దారులన్నీ మూసుకుపోయాయి. బయటి ప్రాంతాలతో మచిలీపట్నానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వరదలతో కృష్ణా జిలా అంతటా బీభత్స వాతావరణం నెలకొంది. మంచినీళ్లు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ వర్షాలు పడవచ్చుననే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. బుడమేరు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతోంది. దానిలో వరద ఉధృతి మరింత పెరుగుతోంది. దీంతో గుడివాడకు, హనుమాన్జంక్షన్కు మధ్య రాకపోకలు స్తంభించాయి. కృష్ణా డెల్టాలో 80 శాతం వరి పంట నీట మునిగింది. దీవిసీమకు తీరని నష్టం వాటిల్లింది. దివిసీమకు కూడా రాకపోకలు స్తంభించాయి.
డ్రెయిన్ల వ్యవస్థ సరిగా లేకపోవడంతో పెదపారుపుడిలో 300 ఇళ్లు, 3 వేల ఎకరాల పంటలు నీట మునిగాయి. బందరు బైపాస్ రోడ్డు నీటిలో మునిగిపోయింది. ఈ ప్రాంతంలో ఏడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉంగుటూరు మండలంలో 1500 ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. మచిలీపట్నంలో అత్యధికంగా 34సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీలగలగంజి వంతెనపై రెండడుగుల లోతు నీరు ప్రవహిస్తోంది. ఆళ్లమూడిలో 200 ఇళ్లు నీట మునిగాయి. డ్రైన్ల పరిస్థితి సరిగా లేకనే ముంపు తీవ్రత ఎక్కువగా వుందని భావిస్తున్నారు.
రాష్త్రంలోని అకాల వర్షాలకు ఇప్పటి వరకు 11 మంది మరణించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రేపు ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. అవనిగడ్డ, రేపల్లె, చీరాలల్లో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం సమీక్షించారు.. వరద తాకిడికి 1194 గృహాలు పూర్తిగా, 1854 గృహాలు పాక్షికంగా దెబ్బ తిన్నట్లు ప్రాథమిక అంచనా. కృష్ణా జిల్లాలోని 14 మండలాలు, గుడివాడ పట్టణం పూర్తిగా నీట మునిగాయి. గుంటూరు జిల్లా కారంచేడు మండలంలోని ప్రజలనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.