కడప జిల్లాలో నలుగురి దారుణ హత్య
కడప: కడప జిల్లా రాయచోటి సమీపంలోని కొత్తపేట రామాపురంలో నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఒక పాప వున్నారు. రిటైర్డ్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసి) మేనేజర్ రఘునాథరెడ్డితో ఆయన కుటుంబ సభ్యులను హత్య చేశారు. మృతుల్లో రఘునాథ రెడ్డి భార్య పద్మావతి, కూతురు ఆదిలక్ష్మితో పాటు రెండేళ్ల మనవరాలు ఉన్నారు.
ఆస్తి కోసం రాఘునాథరెడ్డి అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యలకు కుటుంబ తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కూతురు ఆదిలక్ష్మిని బద్వేలుకు చెందిన మధుసూదన్ రెడ్డికి ఇచ్చి రఘునాథరెడ్డి వివాహం చేశాడు. వారికి ఇద్దరు కూతుళ్లు పుట్టారు. మధుసూదన్ రెడ్డి ఆదిలక్ష్మి ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రఘునాథరెడ్డి కూతురు, మనవరాళ్లు, భార్యలతో తన సొంత ఇంట్లో వుంటున్నాడు. ఇటీవలే మధుసూదన్ రెడ్డి బద్వేలుకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు. రాత్రి జరిగిన హత్యలో రఘునాథరెడ్డితో పాటు భార్య, కూతురే కాకుండా మనవరాలు భరణి కూడా మరణించారు. మరో మనవరాలు మోనికా మాత్రం బతికి బయటపడింది. ఒకే కుటుంబానికి చెందిన ఆ నలుగురిని కత్తులతో నరికి చంపారు. మధుసూదన్ రెడ్డి డబ్బుల కోసం తరుచూ మామను వేధించేవాడని స్థానికులు అంటున్నారు. హత్యలకు ఇదే కారణం కావచ్చునని భావిస్తున్నారు.