కోస్తా జిల్లాల్లో వాయుగుండం బీభత్సం
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో దక్షిణ కోస్తా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. వేలాది ఎకరాలు పంటల నీట మునిగిపోయాయి. ప్రకాశం జిల్లా పరిస్థితి దయనీయంగా వుంది. వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా జిల్లాలో జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది బాపట్లకు సమీపంలో కేంద్రీకృతమై వుంది. అయితే అది నిలకడగా వుంది. వాయుగుండం తీరం దాటినప్పటికీ అది సృష్టించే బీభత్సం ఆగలేదు. మరో 24 గంటల పాటు ఇదే పరిస్థితి వుంటుందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు అంటున్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు ఇంకా కురిసే అవకాశం వుంది. కృష్ణా జిల్లాలోని నడివాడలో బుడమేరు పొంగిపొర్లుతోంది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బందరులో ఐదుడుగుల మేరకు నీరు చేరి వుంది. ప్రకాశం జిల్లా చినగంజాం మండలంలోని పెదగంజాంతో పాటు మరో గ్రామం నీటిలో మునిగాయి. చీరాలలో డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి.ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది మరణించారు.
సాకి కాలువలో లారీ కొట్టుకుపోయి నలుగురు గల్లంతయ్యారు. ప్రకాశం జిల్లాలోని దాదాపు 300 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విజయవాడలో కొండలు విరిగి పడుతున్నాయి. దీంతో ఇళ్లలోని వారు బయటకు వచ్చి ప్రాణాలు తూర్పు గోదావరి జిల్లాలో చలికి తట్టుకోలేక ఒక వ్యక్తి మరణించారు. లోయర్ పుల్లేరు, క్యాంప్బెల్లకు గండ్లు పడ్డాయి. మచిలీపట్నానికి, ఏలూరుకు మధ్య రాకపోకలు స్తంభించాయి. మచిలీపట్నంలోని పలు కాలనీల్లో నీరు చేరింది. దీంతో ప్రజలను పడవల్లో తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నివాసాలు జలం మధ్య చిక్కుకున్నాయి. మచిలీపట్నానికి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. ప్రకాశం జిల్లా రొంపేరు కాలువకు గండిపడింది. దీంతో కారంచేడు, చీరాలకు మధ్య రాకపోకలు స్తంభించాయి. వర్షాల కారణంగా మంగళవారం జరగాల్సిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల అధికారితో పాటు అధికారులంతా సహాయ, పునరావాస చర్యల కోసం మచిలీపట్నంలో వుండిపోయారు.