500 మీ. లోపు ఔటర్ నిర్మాణం వద్దు: హైకోర్టు
హైదరాబాద్: హైదరాబాద్కు మంచినీరందించే హిమాయత్సాగర్ కరకట్ట పరిధిలో 500 మీటర్ల లోపు ఏ విధమైన నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్రీన్బెల్ట్ పరిధిలో హిమాయత్ సాగర్ కరకట్ట దెబ్బ తినేలా అవుటర్ రింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ జీవానందరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సింఘ్వీ, జస్టిస్ నాగార్జునరెడ్డిలతో కూడిన హైకోర్టు బెంచ్ మంగళవారం ఆ ఆదేశాలు జారీ చేసింది.
జీవానందరెడ్డి పిటిషన్పై వివరణ ఇవ్వాలని సోమవారంనాడు హైకోర్టు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు, హుడాకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హిమాయత్సాగర్ 1400 మీటర్ల పొడవునా నిబంధనలకు వ్యతిరేకంగా ఏ విధమైన నిర్మాణాలు జరగడం లేదని ప్రతివాదుల తరఫు న్యాయవాది తెలియజేశారు. అయితే హిమాయత్సాగర్ కరకట్ట పొడవెంత అని హైకోర్టు అడుగుతూ ఆ కరకట్ట పొడవునా 500 మీటర్ల పరిధిలో నిర్మాణాలు జరపవద్దని ఆదేశించింది. తాము 500 మీటర్ల పరిధిలోపల నిర్మాణాలు జరపబోమని హుడా తరఫు న్యాయవాది హామీ ఇచ్చారు.